Perni Nani: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలనూ అబద్ధాలు, విపక్షంపై బురద చల్లేందుకే వాడుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. పెరిగిపోతున్న రెవెన్యూ లోటును తగ్గించడం చేతకాని ప్రభుత్వం, మేం ఐదేళ్లలో చేసిన అప్పుల్ని 20 నెలల్లోనే చేసింది కాక, ఇంకా గొప్పలు చెప్పుకుంటోందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పి దొరికిపోయిన ప్రభుత్వం.. హెరిటేజ్ లింకులు బయటపడే సరికి తప్పించుకుందన్నారు. రాష్ట్రంలో ఏ రంగంలోనూ అభివృద్ధి లేదని, సంక్షేమాన్ని సైతం విస్మరించారని పేర్ని నాని మండిపడ్డారు.
ప్రెస్ మీట్ లో పేర్ని నాని ఇంకేమన్నారంటే..:
బడ్జెట్ సమావేశాలు వృథా చేసిన సర్కార్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే.. రాష్ట్రానికి ఏం మేలు జరగబోతోంది, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలు, విద్య, వైద్యం, బడ్జెట్ లోటు ఇలా పలు అంశాలపై చర్చ జరుగుతాయని అనుకున్నామని కానీ, చంద్రబాబు సర్కార్ తమ మూడో బడ్టెట్ లోనూ నిరాశనే మిగిల్చందన్నారు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేసారని గతంలో చంద్రబాబు విషం చిమ్మారని, కానీ జగన్మోహన్ రెడ్డికి మీరు కనీసం 100 కోట్లు కూడా లేని ఖజానా అప్పజెప్పారన్న విషయం గుర్తుంచుకోవాలి. అయినా అనుభవం లేని యువ ముఖ్యమంత్రి తన ఐదేళ్ల పాలన తర్వాత మీకు 7 నుంచి 8 వేల కోట్లతో ఖజానా అప్పగించారు. ఇంత చేసినా మీరు జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి ఇవాళ్టికీ అవే అబద్దాలు చెప్తున్నారు.
185 శాతానికి రెవెన్యూ లోటు
ఇవాళ బడ్జెట్ లో సవరించిన అంచనాల ప్రకారం 2025-26 లో డిసెంబర్ 31 నాటికి 60,480 కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. కానీ గత సంవత్సరం బడ్జెట్ అంచనాలు తయారు చేసినప్పుడు 33,185 కోట్లు మాత్రమే లోటుకు పరిమితం అవుతామని చెప్పారు. అంటే ఊహించిన దాని కంటే దాదాపు 185 శాతం లోటు పెరిగింది. ఈ మూడు నెలల్లో మీరు ఈ లోటు పూడ్చాలంటే 90 వేల కోట్లు సంపాదించాలి. అది సాధ్యమేనా ?? ఆర్దికమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబు చెప్పాలి. మీ మాటలు పచ్చి మోసం అని ఈనాడు వంటి పత్రికల్లో లెక్కలే చెప్తున్నాయి. అసెంబ్లీలో మీరు సమర్పించే లెక్కలకూ, ఈనాడులో రాస్తున్న దాంట్లో ఎందుకు తేడా ఉందో కూడా చంద్రబాబు చెప్పాలి. కొత్త బడ్జెట్ లో సైతం అంతా దాపరికమే. అప్పుల కూడా సరిగ్గా చూపించకుండా దాచేస్తున్నారు. గతేడాది కంటే అప్పు తగ్గిస్తామని పైకి చెప్తూ సవరించిన అంచనాల ప్రకారం లక్షా 3 వేల కోట్లు అప్పు చేశామని, వచ్చే ఏడాది 98 వేల కోట్లు చేస్తామని చెప్తున్నారు. వాస్తవానికి జనవరి నాటికి ప్రభుత్వానికి వచ్చిన రాబడి లక్షా 40 వేల కోట్లే. సవరించిన అంచనా ప్రకారం ఈ రాబడి లక్షా 96 వేల కోట్లని చెప్తున్నారు. అంటే ఈ మూడు నెలల్లో 56 వేల కోట్లు రాబడి ఎలా వస్తుందో చెప్పాలి. ఇది మోసం కాదా చెప్పాలి.
అసెంబ్లీలో అబద్దాల ప్రచారం
కరెంటు ఛార్జీల తగ్గింపు మరో అబద్దం. చంద్రబాబు ఉంటున్న లింగమేనని రమేశ్ ఇంటి కరెంటు బిల్లు, పవన్ కళ్యాణ్ ఉంటున్న ఇంటి కరెంటు బిల్లులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయో బయటపెడితే బండారం బయటపడుతుంది. భారం పెరిగిందన్న విషయం అర్దమవుతుంది. అలాగే 22ఏ భూముల్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో దుర్వినియోగం చేశారని చెప్పడం కూడా బరితెగింపే. 2016-18 మధ్య రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో భూముల్ని ఎవరు రికార్డుల్లోకి ఎక్కించారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా వీటిని ఈ జాబితాలో పెట్టారా చెప్పాలి.
విశాఖలో ఐదు కంపెనీలకు 99 పైసలకు ఎకరం చొప్పున భూములు ఇచ్చామని చెప్పారు. గుజరాత్ లో మోడీ సీఎంగా ఉండగా టాటా సంస్దకు ఇలాగే భూములు ఇచ్చారని లోకేష్ సభలో చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. టాటా మోటార్స్ కు సనద్ లో 1100 ఎకరాల్ని ఎకరాకు రూ.900 చొప్పున చెల్లించేలా ఇచ్చారు. మోడీ టాటాలకు ఇచ్చిన భూములపై లోకేష్ వక్రభాష్యం చెప్తున్నారు. భారత్ లో రూపాయి విలువ పడిపోతే ఒక్క విశాఖలో రూపాయికి విలువ పెంచేశారు. రూపాయికి 20 ఎకరాల పొలం వస్తుంది. మార్కెట్లో దీని విలువ ఎకరా రూ.50కోట్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు, సామాన్యులు సెంటు, సెంటున్నర స్థలాలు ఆక్రమించుకున్నారని వేలాది ఇళ్లను కూల్చివేశారు. మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే ఇలాంటి భూముల్ని క్రమబద్ధీకరణ చేసిన ప్రభుత్వం.. మిగిలిన 174 నియోజకవర్గాల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు. కానీ విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములను మాత్రం క్రమబద్దీకరించారు.
లడ్డూపై దొరికిపోయిన కూటమి సర్కార్
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి అంశంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ప్రజలు తీగ లాగితే డొంక కదిలినట్లుగా అనేక డెయిరీ సంస్థల పేర్లు బయటకు వస్తున్నాయి. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ బ్రాండింగ్ను కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది. తన కుటుంబ జీవనాధారం కోసం హెరిటేజ్ డెయిరీని నడుపుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు, ఆయన సతీమణి మాత్రం సంస్థ టర్నోవర్ రూ.4 వేల కోట్లని చెప్పారు. చంద్రబాబు మరోసారి తన ఆస్తులు లక్ష కోట్లని చెప్పారు. ఏదీ నిజం?
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకు బ్రాండింగ్ అవసరం లేదు, కానీ హెరిటేజ్ డెయిరీకి మాత్రం బ్రాండింగ్ కావాలా?. అసెంబ్లీలో చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీ ప్రభుత్వం గానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి గానీ ఒక్క లీటర్ పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సరఫరా చేయలేదని చెప్పారు. కంపెనీ ప్రతినిధులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చానని కూడా చెప్పారు. ఇంతకన్నా పచ్చి దగా మాటలు ఉంటాయా? . 2014–2019 మధ్య కాలంలో ఎన్ని లక్షల రూపాయల విలువైన మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లు పంపిణీ చేశారో జనం మరచిపోయారనుకుంటున్నావా?. ‘చంద్రన్న కానుక’ కార్యక్రమంలో హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారా? లేదా?
వేసవిలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి, హెరిటేజ్ మజ్జిగనే కొనాలని ఎందుకు సూచించారు? రాష్ట్రంలో సంగం డెయిరీ, విశాఖ డెయిరీ వంటి ఇతర సంస్థలు ఉన్నా హెరిటేజ్ ఉత్పత్తులనే ఎందుకు కొనాలని ఆదేశాలు ఇచ్చారో సమాధానం చెప్పాలి. మీరు సీఎంగా ఉండగా టెండర్లు లేకుండా టీటీడీకి 2 వేల కిలోల పాలపొడి అమ్మారు. మరి హెరిటేజ్ ఎప్పుడూ టెండర్లలో పాల్గొనలేదని రాతపూర్వకంగా ప్రకటించగలరా?
హామీలన్నీ గాలికొదిలేసి అప్పుల బాటలో
చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల ప్రకటనలు వాస్తవాలకు దూరం. 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం సరికాదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, వారి పేర్లతో పబ్లిక్ డోమైన్లో ప్రకటించే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా?. 6.28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్న ప్రభుత్వం, వారిని నిలబెట్టి ఒక ఫొటో అయినా చూపించాలి, లేదా ఏ కంపెనీలో ఏ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారో వివరాలు వెల్లడించాలి. గత ప్రభుత్వం హయాంలో పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్, డీఎస్సీ పోస్టింగ్లను ఈ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది.
జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పులు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 20 నెలల్లోనే దాదాపు రూ.3.20 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు శ్రీహరికోటలో రాకెట్ మాదిరిగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. నారా లోకేష్ పాదయాత్రలోనూ, ప్రతి మీటింగ్లోనూ ప్రతీ ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఊదరగొట్టాడు. 2025, 2026 జనవరి ముగిసిపోయింది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. ఇళ్ల నిర్మాణాల్లో గత ప్రభుత్వం రూ.7 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. కానీ 20 నెలలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించి ఉగాది నాటికి 3 లక్షల ఇళ్లు ప్రారంభిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు.
మండలిలో దిగజారిపోయి మతాల చర్చ
మండలిలో ఓ మంత్రి జగన్ క్రైస్తవుడా కాదా అని బరితెగించి మాట్లాడుతున్నారు. నా మైక్ లో మాట్లాడింది విని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అడుగుతున్నారు. కుల,మత, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని దేవుడి మీద ప్రమాణం చేసి మంత్రులు మాట్లాడుతున్న భాష ఇది. మీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కంటే మిన్నగా హిందూ ధర్మం ఆచరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుది ఏ మతమో మీరూ చెప్పండి. గజనీ, ఘోరీ తర్వాత చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో అత్యధిక గుళ్లు ధ్వంసం అయ్యాయి.
హిందూ ధర్మం పాటించే వారైతే చంద్రబాబు ఇన్ని గుళ్లు ఎందుకు కూల్చారు. తిరుమలలో వేయికాళ్ల మండపం చంద్రబాబు హయాంలోనే కూల్చిన విషయం మర్చిపోయారా ? ముగ్గుర్ని కంటే పాతికవేలు ఇస్తామంటున్న చంద్రబాబు.. ఆయన కానీ, కుటుంబ సభ్యులు కానీ దీన్ని ఎందుకు పాటించట్లేదు. వేల కోట్ల ఆస్తులున్న చంద్రబాబు కుటుంబమే ఎక్కువ మంది పిల్లలు కనేందుకు ముందుకు రాకపోతే.. పేదలు ఎలా ముందుకొస్తారో చెప్పాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటున్న చంద్రబాబు.. రేపు ఆయన మాట విని పిల్లల్ని కంటే మీ పిల్లలకు నేను ఎందుకు డబ్బులివ్వాలని అడగరన్న గ్యారంటీ ఉందా ?, వైఎస్సార్సీపీ వాళ్లు 11 మంది గెల్చినా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని అంటున్న పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే అబద్దాలే. మేం 11 మందే గెలిచినా 11 వేల మంది గెలిచినట్లు దమ్ముగానే రాజకీయం చేస్తున్నట్లు పేర్ని నాని తెలిపారు.
ఇవీ చదవండి: Perni Nani: స్వార్జిత ఆస్తులను ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేవారెవరైనా ఉన్నారా?
Perni Nani: చంద్రబాబు చెప్పినట్లు పీవీ రమేష్ ఆడుతున్నాడు: పేర్ని నాని
