YS Sharmila : విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ కాంగ్రెస్ కమిటీ (Andhra Pradesh Congress Committee) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని ఆమె “గ్రేట్ డీల్ కాదు.. ఇండియాకు బ్లాక్ డీల్”గా అభివర్ణించారు.
మోడీ గారి తీరు “నామ్ నరేందర్.. కాం సరెండర్”గా ఉందంటూ, అమెరికా చేతిలో భారత ప్రధాని కీలుబొమ్మలా మారారని షర్మిలా ఆరోపించారు. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్కు తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు.
రైతాంగం, పరిశ్రమలకు బ్లాక్ డే
ఈ ఒప్పందం దేశ రైతాంగానికి, పరిశ్రమల రంగానికి బ్లాక్ డే లాంటిదని ఆమె పేర్కొన్నారు. సున్నా సుంకాలతో భారత మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తులు ప్రవేశిస్తే, స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణశాసనమేనని హెచ్చరించారు. ఇండియా ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలను 18 శాతం తగ్గిస్తే, అమెరికా దిగుమతులపై మోడీ గారు సుంకాలు సున్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన పన్నులు 5 శాతం లోపే ఉండగా, ఇప్పుడు 5 నుంచి 50 శాతం వరకు పెంచి, అందులో 18 శాతానికి తగ్గిస్తే భారత్కు లాభం ఎలా అవుతుందని నిలదీశారు.
అమెరికాకు 100 శాతం లాభం?
సుంకాల తగ్గింపుతో భారత్కు దక్కే ప్రయోజనం కంటే, సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం 100 శాతం లాభమని షర్మిలా ఆరోపించారు. “ఇండియా రైతులకు ఉరి పెట్టి, అమెరికా వ్యవసాయానికి మోడీ గారు గ్రేట్ డీల్ ఇచ్చారు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మోడీ తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తే మళ్లీ సుంకాలు 50 శాతం పెంచుతామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా హెచ్చరిస్తున్నారంటే, ఇది బ్లాక్ మెయిల్ కాదా? అని ప్రశ్నించారు.
సరెండర్ అగ్రిమెంట్ను బయటపెట్టాలి
ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు సమతూకంగా ఉండాలని, ఒక దేశానికి నష్టం, మరో దేశానికి లాభం చేసే వాటిని ఒప్పందాలు అనలేమని షర్మిలా అన్నారు. అమెరికా ప్రయోజనాల కోసం 75 ఏళ్ల వాణిజ్య ఒప్పందాల చరిత్రను మోడీ గారు తుంగలో తొక్కారని ఆరోపించారు. ఏటా 100 బిలియన్ డాలర్ల దేశ సొమ్మును అమెరికాకు అప్పనంగా కట్టబెట్టే కుట్ర ఇది అని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని Indian National Congress తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
మోడీ వెంటనే సరెండర్ అగ్రిమెంట్ను బయటపెట్టాలని, అమెరికా నుంచి దిగుమతి కాబోయే అన్ని ఉత్పత్తులు, వాటిపై విధించే పన్నుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: YS Sharmila : జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్.. కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
Sharmila : మోదీపై షర్మిల ఘాటు విమర్శలు.. ఓట్ చోర్.. గద్దె ఛోడ్!
