Vizianagaram Fishermen : విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ నౌకాదళం అరెస్టు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే, మత్స్యకారుల విడుదలకు అవసరమైన దౌత్య చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం లేఖ రాశారు.
విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కు చెందిన మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్ (రిజిస్ట్రేషన్ నెం. INDAP-V5-MM-75) అక్టోబర్ 13, 2025న ఉదయం 4 గంటలకు లోతు సముద్ర చేపల వేటకు బయలుదేరినట్లు తెలిపారు.
అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటిన పడవ
వేట సమయంలో వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాల కారణంగా పడవ అనుకోకుండా అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు దాటిందని మంత్రి వివరించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నౌకాదళం పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 22, 2025న అదే ప్రాంతంలో వేట చేస్తున్న మరో పడవ సిబ్బంది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, అప్పట్లో అరెస్టయిన పడవ డ్రైవర్ బంగ్లాదేశ్ నౌకాదళం తమను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇచ్చినట్టు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
సీఎం వెంటనే స్పందన
ఈ ఘటనను మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే, మత్స్యకారుల కుటుంబాల పరిస్థితిని పరిగణలోకి తీసుకుని సీఎం వెంటనే స్పందించారని తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ, హోంశాఖల ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో దౌత్య పరమైన చర్చలు జరిపి — మత్స్యకారులతో పాటు వారి పడవను కూడా సురక్షితంగా విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.
పరస్పర విడుదల ప్రక్రియ కొనసాగుతోంది
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం — ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 122 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో భారత్లో కూడా బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది మత్స్యకారులు నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో, పరస్పర విడుదల ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని పూర్తిగా మానవతా దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
కుటుంబాలకు భరోసా
బంగ్లాదేశ్లో అరెస్టయిన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన బలంగా నిలబడుతుందని స్పష్టం చేశారు. మత్స్యకారుల సురక్షిత విడుదల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్కు గడ్డుకాలం: వరల్డ్ కప్ల నుంచి నిష్క్రమణ… కోట్ల నష్టం… భవిష్యత్తుపై నీలినీడలు
Bangladesh : బంగ్లాదేశ్లో మైనారిటీలపై ఉన్మాద హింస: హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన దుండగులు
