Andhra Pradesh : అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఎత్తైన జామాయిల్ చెట్ల మధ్య, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం పరిధిలోని అటవీ ప్రాంతానికి గేదెలను తోలేందుకు వెళ్లిన గ్రామస్తులు అక్కడ తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అనుమానించి పరిశీలించారు. అప్పటికే ఉబ్బిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహానికి సంబంధించి ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోయినా, సాంకేతిక ఆధారాలు, సైంటిఫిక్ పద్ధతుల సహాయంతో పోలీసులు కేసును ఛేదించారు. హతురాలిని పామర్తి శిల్పారాణి (25)గా గుర్తించారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంకు చెందినవారు. శిల్పారాణికి గతంలో వెంకటేశ్వరరావుతో వివాహం కాగా, భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఆ తర్వాత ఆమె స్వగ్రామానికి సమీపంలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి వచ్చింది.
ఈ సమయంలో రామానుజపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి గణేష్ (19)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వయస్సులో ఆరేళ్ల తేడా ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. భర్త మృతితో ఒంటరిగా ఉన్న శిల్పారాణి, గణేష్ తనకు అండగా ఉంటాడని భావించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే కొంతకాలానికి గణేష్ ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించగా, ఈ వ్యవహారం బెదిరింపుల వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో గణేష్ ఒక పథకం ప్రకారం ఆమెను మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడి సమస్యను ముగించేందుకు ప్రయత్నించినా, మాట వినకపోవడంతో కోపోద్రిక్తుడై సమీపంలో ఉన్న జామాయిల్ కర్రతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
సంఘటనా స్థలంలో ప్రత్యక్ష ఆధారాలు పెద్దగా లభించకపోయినా, మొబైల్ డేటా, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే గణేష్ను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన మరోసారి సంబంధాల పేరుతో జరుగుతున్న నేరాలపై చర్చకు దారి తీస్తోంది.
ఇవీ చదవండి: Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..
Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..
