Strong Rooms: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికలతో కలిసి ఆయన పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు, 8 శాసన నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఉన్న భద్రతా పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, తాళాలకున్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అన్ని చోట్లా సీసీ కెమెరాలు పరిశీలన చేశారు. తనిఖీ అనంతరం సందర్శకుల రిజిష్టర్ లో ఆయన సంతకం చేశారు. మూడంచెలు గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్డ్ పోలీసు గార్డు, సివిల్ పోలీసు బందోబస్తులను ఆయన పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూంలు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈవిఎం కంట్రోల్ రూంను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా అన్సారియా, టెక్కలి రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు డాక్టర్ భరత్ నాయక్, సి.హెచ్. రంగయ్య, అప్పారావు, లక్ష్మణమూర్తి, సుదర్శన్ దొర, రామ్మోహనరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
Telangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
What is Election Code: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఏయే అంశాలపై నిషేధం విధిస్తారు?
Election Day: ఏపీలో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవు
