Lok sabha Elections 2024: దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లో రాబోతోంది. లోక్ సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. సార్వత్రిక ఎన్నికలు (Lok sabha Elections 2024) నిర్వహించే తేదీలపై సీఈసీ (Central Election Commission) కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో పర్యటనల మీద పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా నుంచి కథనాలు వెలువడుతున్నాయి. Lok sabha Elections 2024:
దేశంలో లోక్సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. వీటికి ఈ ఏడాది మేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
ఇందుకోసం మార్చి 8 లేదా 9వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు, బలగాలపై చర్చ జరిగే ఆస్కారముంది. తర్వాత మార్చి 12 లేదా 13వ తేదీల్లో ఈసీ బృందం జమ్మూకశ్మీర్లో తిరిగి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలిస్తుంది. లోక్సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. తర్వాత మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే చాన్స్ ఉంది.
ఇక గత లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు మొత్తంగా 7 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కంపు చేసి ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా ఏప్రిల్ మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
