BRS Party: పదేళ్ల తర్వాత హ్యాట్రిక్ కొడతామని కాన్ఫిడెంట్గా ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమిపై ఓ విశ్లేషణ ఇలా.. (BRS Party)
* ఈ ఎన్నికలను మొదటి నుంచి బీఆర్ఎస్ లైట్ తీసుకున్నట్లు అనిపించింది.
* సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లు తగ్గిపోవడం, మాటలు కూడా తగ్గడం మైనస్ అయ్యింది.
* బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న ఆరోపణలు జనం నమ్మి కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.
* కేటీఆర్ను సీఎం చేస్తారని అనుకోవడం వల్ల పార్టీ కేడర్ అంతర్గతంగా పక్కచూపులు చూశారనుకోవచ్చు.
* సీఎం తరఫున ఏం మాట్లాడాలన్నా కేటీఆర్ హడావుడి ఎక్కువగా కనిపించింది.
* లిక్కర్ స్కామ్ కేసులో కవితపై చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగించడం లాంటి పరిణామాలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అనిపించేలా చేశాయి.
* ధరణి పోర్టల్ పేరుతో జరుగుతున్న అవకతవకలు, అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీశాయి. కౌలు రైతులు, పోడు భూముల రైతులు తీవ్రంగా నష్టపోయారనే వాదన ఉంది. భూస్వాములే బాగుపడ్డారనే ఆరోపణలున్నాయి.
* ప్రజలకు పంచిన భూములు కూడా ధరణి పోర్టల్లో భూస్వాముల పేరుతో ఉండటం, రైతు బంధు కూడా వారికే అందుతోందన్న పరిణామాలు బీఆర్ఎస్కు మైనస్ అయ్యాయి.
* కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు బీఆర్ఎస్ను నిలువునా ముంచేశాయి.
* మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు రావడం, ప్రాజెక్టులు, పథకాల్లో అధికార పార్టీ మేత మేసిందన్న ఆరోపణలు బీఆర్ఎస్కు మైనస్ అయ్యాయి.
* నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం పెద్ద మైనస్
* పేపర్ లీకుల కారణంగా ఎన్నికల ముందు ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన, సూసైడ్ నోట్ లో లీకేజీల బెడద వల్లే చనిపోతున్నట్లు వెలుగుచూడటం నిరుద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేసింది.
* ఇసుక మాఫియా పెరిగిపోవడం, గనుల్లో దోపిడీ జరిగిందన్న ఆరోపణలు, భూకబ్జాల ఆరోపణలు, ఎక్కడా ఖాళీ కనిపించినా అధికార పార్టీ భూకబ్జాలుచేస్తోందన్న ఆరోపణలు మైనస్ అయ్యాయి.
* కౌలు రైతులకు రైతు బంధు అందకపోవడం చేటు చేసింది. అధికార పార్టీ అనుచరులకే దక్కిందనే ఆరోపణలు దెబ్బతీశాయి.
* కేసీఆర్ సెక్రటేరియట్కు రాకుండా ప్రగతి భవన్లో, లేదా ఫామ్ హౌస్లో ఉండిపోవడం, ప్రజలు వినతిపత్రాలు ఇవ్వలేకపోవడం, సమస్యలుచెప్పుకోవడానికి వేదిక లేకపోవడం బీఆర్ఎస్కు మైనస్ అయ్యింది.
* ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ జాప్యం చేయడం, మధ్యంతర భృతి 5 శాతమే ప్రకటించడం, డీఏలు విడుదల చేయకపోవడం, మెడికల్ బిల్స్, పీఎఫ్ లాంటి వాటిలోనూ ఆలస్యం చేయడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.
* సిట్టింగ్లపై వ్యతిరేకతను పసిగట్టిన రేవంత్.. దమ్ముంటే సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలని పలుమార్లు కేసీఆర్కు సవాల్ విసిరారు. ఈ ట్రాప్లో పడిన బీఆర్ఎస్.. పలువురు సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి చేయి కాల్చుకుంది.
* నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సీఎం మాదిరిగా హల్ చల్ చేశారనే ఆరోపణలున్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం మైనస్ అయ్యింది.
ఇదీ చదవండి: Telangana Congress Victory: కాంగ్రెస్ గెలుపు వెనుక రహస్యాలు.. పదేళ్ల తర్వాత విజయం సాధ్యమైందిలా..
