Chandrababu meeting: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతున్నారు. సుమారు రెండు నెలలకుపైగా పార్టీ పరిస్థితులపై పట్టించుకొనే అవకాశం ఆయనకు కలగలేదు. తాజాగా ఆయన ఢిల్లీకి వెళ్లి లాయర్ సిద్దార్థ్ లూత్రా తనయుడి వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు. అనంతరం అమరావతికి వచ్చారు. తర్వాత తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తాజాగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. (Chandrababu meeting)
ఈ సమావేశంలో ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల హాజరయ్యారు. పార్లమెంటులో 13 అంశాలను ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరువు, సాగు సంక్షోభాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా ప్రణాళిక రచించాలని పేర్కొన్నారు. ఏపీలో పేదిరికం, నిరుద్యోగం పై పార్లమెంటులో ప్రస్తావించాలని డిసైడ్ అయ్యారు. విభజన హామీలు, మహిళల భద్రత అంశాల పై చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ధరల స్థిరీకరణ గురించి లేవనెత్తే అంశాల పై చంద్రబాబు సూచనలు చేశారు. కేసులతో చంద్రబాబు, లోకేష్ ను వేధిస్తున్నారని వివిధ పార్టీల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందని ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. తనకు సమయం కేటాయించాలని సీఈసీకి బాబు లేఖ రాయనున్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు సమయం ఇవ్వాలని లేఖ రాయనున్నారు. సాగర్ డ్యామ్ వద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కుటిల రాజకీయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ జోన్ల వారీగా సర్పంచులతో భేటీకి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 15లోపు సర్పంచులతో భేటీ కావాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
నేడు ఉదయం 10 గంటలకు చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. సాయంత్రం చంద్రబాబు దంపతులు విశాఖకు వెళ్లనున్నారు. రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. అనంతరం కడప దర్గా, విజయవాడ గుణదల మేరీమాత ఆలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు.
తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న చంద్రబాబు
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చంద్రబాబు వాహనశ్రేణి వెంబడి బైక్ ర్యాలీతో యువత మద్దతు పలికారు.
