PM Modi at Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయానికి వెళ్లిన ప్రధానికి ఆలయ అధికారులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలికారు. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. (PM Modi at Tirumala)
రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్ర పటాన్ని, టీటీడీ క్యాలెండర్, డైరీ 2024 పంచగవ్యాలను ప్రధానికి అందచేశారు. అంతకుముందు స్వామి వారి వద్ద ప్రధానిని శేష వస్త్రంతో ఆలయ ప్రధాన అర్చకులు సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థించానని తమ అనుభూతిని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతకు ముందు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది.
రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డా. ఎం. గురుమూర్తి, ఎన్.రెడ్డెప్ప, జి.వి.ఎల్.నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసన సభ్యులు వర ప్రసాద్ రావు ఆదిమూలం, వెంకటే గౌడ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్.జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగర మేయర్ శిరీష, కమిషనర్ హరిత, బీజేపీ నేతలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
ఇదీ చదవండి: A23a: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ ఎందుకు కదులుతోంది?
