CM Jagan with Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కృష్ణాజలాల అంశంపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. (CM Jagan with Amit Shah)
KWDT-II నిర్ణయాన్ని సవాల్చేస్తూ సుప్రీంకోర్టులో 5 స్పెషల్ లీవ్ పిటిషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని హోంమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. గతంలో ఇదే అంశంపై 17.08.2021న, 25-06-2022న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని సీఎం వివరించారు.
KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విధివిధానాలను బేసిన్లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై సీఎం జగన్ చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందన్నారు. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు.
లైడార్ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయన్నారు. ఆ మేరకు నిధులు విడుదలచేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా సీఎం కోరారు.
ఇదీ చదవండి: Senior Citizens welfare: వయోవృద్దుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం