CI Anju Yadav: శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ వ్యవహార శైలి, తదుపరి పరిణామాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల సాయి అనే జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ పరిణామంతో అటు జనసేన నేతల్లో, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకు ముందు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలపై కూడా అంజూ యాదవ్ దూకుడుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. (CI Anju Yadav)
సీఐ అంజూయాదవ్ కు ఛార్జ్ మెమో జారీ
జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన తర్వాత ఆమె సెలవుపై వెళ్లిపోయారు. ఘటనపై నివేదికను ఉన్నతాధికారులు డీఐజీకి పంపారు. ఇంతలోనే అంజూ యాదవ్కు చార్జ్ మెమో జారీ చేశారు. జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మరింత పెద్దదైంది. ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించారు.
సీఐపై డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు
సీఐ అంజూ యాదవ్పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఒక వర్గం పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు ప్రజలపై దాడులు చేస్తున్నారని వాపోయారు. వైసీపీ కి అనుకూలంగా సీఐ గతంలో కూడా ఇలాగే ప్రవర్తించారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీకాళహస్తి సీఐ చేయి చేసుకోవడంపై HRC సీరియస్
జనసేన కార్యకర్త సాయిపై దాడి ఘటనను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీఐ అంజుయాదవ్, స్టేషన్ ఆఫీసర్, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని HRC ఆదేశాలు జారీ చేసింది.
రేపు తిరుపతికి పవన్ కల్యాణ్
తమ పార్టీ కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రేపు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతి ఎస్పీని కలిసి శ్రీకాళహస్తి సీఐపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరనున్నారు.
రేపు సాయంత్రం ఢిల్లీకి పవన్, నాదెండ్ల
ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు ఈ మేరకు ఆహ్వానం అందింది. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్కు ఆహ్వానం అందిందని, సమావేశానికి పవన్ హాజరవుతారని జనసేన పార్టీ వెల్లడించింది. పవన్ కల్యాణ్తోపాటు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ తెలిపింది.
Read Also : Pawan Kalyan: పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని.. జవాబుదారీతనంతో రాజకీయాలు చేస్తున్నా: పవన్ కల్యాణ్