Social Media Posts: సోషల్ మీడియాలో చాలా కాలంగా అసభ్యకర పోస్టులు వస్తూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వీరి చేష్టలు ఆగడం లేదు. ఇటీవలి కాలంలో ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయన కుటుంబీకులపై కూడా అసభ్యకర రీతిలో పోస్టులు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా వేదికగా ప్రత్యక్షమవుతున్నాయి. ఈ వికృత చేష్టలపై తాజాగా ఏపీ సీఐడీ దృష్టి సారించింది. అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తోంది. సీఐడీ చీఫ్ సంజయ్ ఈ మేరకు నిన్న కీలక ప్రెస్మీట్ పెట్టారు. (Social Media Posts)
అసభ్యకరమైన, అవమానకరమైన, అశ్లీల పోస్టులను నియంత్రిస్తూ ఆ రంగంలో సుహృద్బావ వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని సంజయ్ తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ శాంతియుతమైన సమాజంలో ఆందోళనలను, అలజడులను సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులపైనే కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సభ్యులు, జడ్జిలు, సెలబ్రిటీలు, పలు హోదాల్లోని ఉన్నత స్థాయి అధికారులు, వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అవమానకర, అశ్లీల పోస్టులు పెట్టడం ఇటీవలి కాలంలో పరిపాటైందన్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటువంటి దుశ్చర్యలు పెచ్చుమీరుతున్నట్లుగా సీఐడీ విభాగం గుర్తించిందన్నారు. ఈ దుశ్చర్యలను అణచివేసి రాష్ట్రంలో సుహృద్బావ వాతావరణాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో సీఐడీ విభాగం యుద్దం ప్రారంభించిందన్నారు. సోషల్ మీడియా రంగంలో క్రమశిక్షణ, పోలీసింగ్, చట్టపరమైన బాధ్యత పెంచడమే లక్ష్యంగా చర్యలను చేపట్టామన్నారు. ఇప్పటికే సీఐడీ ప్రత్యేక బృందాలను, మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసిందన్నారు.
అసభ్యకర పోస్టులను నియంత్రించేందుకు అత్యధిక ఖరీదైన సాంకేతిక పరికరాలే కాకుండా సాంకేతిక సహాయం కూడా ఎంతో అవసరం ఉందన్నారు. సానుకూల వ్యక్తుల సహాయంతో సోషల్ మీడియాను నిర్వహించే అంశం, పరిశ్రమల భాగస్వామ్యంతో ఒక్కొక్క కేసు దర్యాప్తు చేసే విధానాన్ని రూపొందించేందుకు వచ్చే వారంలో విజయవాడలో, తర్వాత విశాఖపట్నంలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్ఆర్ఐలపైనా నిఘా
ఇందులో సోషల్ మీడియా మాధ్యమ సంస్థలను కూడా బాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయా సంస్థలో కూడా మానిటరింగ్ సెల్స్, పర్యవేక్షణా బృందాలను ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఎన్.ఆర్.ఐ. అక్కౌంట్స్ ను పర్యవేక్షించేందుకు యు.కె., యు.ఎస్.ఏ. లో సీఐడీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం జడ్జిలపై వచ్చే అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిపై కేసులు పెట్టామన్నారు. 2022లో 1,450 పోస్టులు, 2023లో 2,164 సోషల్ మీడియా పోస్టింగులను తొలగించామన్నారు. 1,465 సోషల్ మీడియా అక్కౌంట్స్ ను పర్యవేక్షించామన్నారు. దుర్వినియోగమైన 202 సోషల్ మీడియా ఖాతాలు పర్యవేక్షించి 31 అభ్యంతరకర ఖాతాలను గుర్తించామన్నారు. అదే విధంగా 2,972 సైబర్ బుల్లీ షీట్లు తెరవడం, 45 MLAT & 5 LOC ప్రొసీడింగ్స్ ను జారీ చేశామన్నారు.
ఇదీ చదవండి: Vasireddy Padma: మహిళలపై మహిళలే అలాంటి పోస్టులా..? సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు రావాలి..