IISc Bengaluru: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలలో ఒకటైన బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐఐఎస్సీలోని బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఐఐఎస్సీ బీటెక్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
గతంలో ప్రత్యేక కౌన్సెలింగ్
నిజానికి 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఐఐఎస్సీ బీటెక్ సీట్లను జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేశారు. అయితే అప్పట్లో ప్రత్యేకంగా నిర్వహించిన కౌన్సెలింగ్పై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ఫలితంగా మెరిట్ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐఎస్సీని జోసా కౌన్సెలింగ్లో అధికారికంగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.
జేఈఈ టాపర్లకు మరో టాప్ ఆప్షన్
ఇకపై జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఐఐటీలు మాత్రమే కాకుండా ఐఐఎస్సీలోనూ బీటెక్ సీటు పొందే అవకాశం లభించనుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ 100లో 20 నుంచి 25 మంది వరకు విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు.
ఇప్పటివరకు వీరంతా ప్రధానంగా ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్లను ఎంచుకుంటుండగా.. ఇకపై ఐఐఎస్సీ కూడా కీలక ఎంపికగా మారనుంది.
ప్రస్తుతం ఉన్న కోర్సులు, సీట్లు
ప్రస్తుతం ఐఐఎస్సీలో కేవలం బీటెక్ ఇన్ మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ కోర్సులో మొత్తం 52 సీట్లు ఉన్నాయి.
ఇందులో 8 సీట్లు అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయిస్తారు
మరో 4 సీట్లు విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు
ఐఐఎస్సీ జోసా పరిధిలోకి రావడంతో భవిష్యత్తులో బీటెక్ కోర్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.
సైన్స్కు ఐఐఎస్సీ బ్రాండ్
బెంగళూరు ఐఐఎస్సీ ప్రధానంగా సైన్స్, రీసెర్చ్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ. ఇక్కడ జరుగుతున్న లోతైన పరిశోధనల కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు పీహెచ్డీ కోసం ఐఐఎస్సీనే లక్ష్యంగా పెట్టుకుంటారు.
2016 నుంచి ఇప్పటివరకు జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ఐఐఎస్సీ నిరంతరం దేశంలో నెంబర్ వన్ సంస్థగా నిలుస్తోంది. ఇకపై ఇంజనీరింగ్ కోర్సులు కూడా విస్తరించితే, సైన్స్తో పాటు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఐఐఎస్సీ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.
విద్యార్థులకు లాభం
జోసా కౌన్సెలింగ్లో ఐఐఎస్సీ చేరడం వల్ల
టాప్ ర్యాంకర్లకు మరో ప్రీమియం ఆప్షన్
పారదర్శక అడ్మిషన్ ప్రక్రియ
మెరిట్కు పూర్తి న్యాయం లభించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 నోటిఫికేషన్ రిలీజ్డ్.. రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచంటే?
JEE NEET: ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. విశాఖలో నీట్ జేఈఈ శిక్షణ కేంద్రం
