Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యే దశకు చేరుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైయస్సార్ సీపీ హయాంలో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని ఆయన గుర్తు చేశారు. రేపు తొలి విమానం ల్యాండింగ్ కావడం ఏపీ అభివృద్ధి మార్గంలో కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
అభివృద్ధిలో మైలురాయి
‘‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది.’’ అని జగన్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: Bhogapuram : భోగాపురం ఎయిర్పోర్టులో విజయవంతమైన ట్రయల్ రన్.. ఆపరేషనల్కు మరో కీలక అడుగు
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్ట్ సర్వం సిద్ధం.. రేపే తొలి విమానం టెస్టింగ్.. క్రెడిట్ ఎవరిది?
