YSRCP Book on CBN : చంద్రబాబు నేతృత్వంలో ఏడాది కిందట సరిగ్గా ఇదేరోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పాలనతో ప్రజలకు చీకటి రోజులను మిగిల్చిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏడాది పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్సీపీ ప్రచురించిన పుస్తకాన్ని (YSRCP Book on CBN) పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఒక అరాచకాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైయస్ జగన్ పాలన అంటే నమ్మకం గుర్తుకు వస్తే, ఇప్పుడు చంద్రబాబు కూటమి పాలనలో ప్రజలకు పొడిచిన వెన్నుపోటే గుర్తుకు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా వ్యవస్థల నిర్వీర్యం నుంచి ప్రజాస్వామ్య విధ్వంసం వరకు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే…
ఏడాది కిందట ఈ రోజు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2019-24 మధ్య ఒంటరిగా వైయస్ఆర్సీపీ పోటీ చేసి 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో మూడు పార్టీల కుటమితో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సాధారణంగానే వైయస్ జగన్ ఏడాది పాలనను, చంద్రబాబు కూటమి ఏడాది పాలనను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారు.
ఎన్నికల పలితాలు వెలువడిన జూన్ 4న ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు కూటమి పాలనపై వైయస్ఆర్సీపీ వెన్నుపోటు దినంగా ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు బనాయించడం, అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం చేశారు. దానికి ఉదాహరణలను సవివరంగా వివరిస్తూ, ఫోటోలతో సహా వైయస్ఆర్సీపీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దానిని ఈ రోజు ఆవిష్కరిస్తున్నాం. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ అయిదు కోట్ల ఏపీ ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారో ఈ పుస్తకం ద్వారా వెల్లడిస్తున్నాం. అన్ని ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని వెలువరించాం.
వైయస్ జగన్ పాలనలో బంగారు భవిష్యత్తుకు పునాదులు
గతంలో వైయస్ జగన్ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఎలా పునాదులు వేసి, ముందుకు తీసుకువెళ్ళారో ఈ పుస్తకంలో ఉంది. అలాగే నేడు చంద్రబాబు ఆ పాలనను ఎలా విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని చీకటి రోజుల వైపు ఎలా నడిపించారో కూడా సవివరంగా పొందుపరచడం జరిగింది. వైయస్ జగన్ అయిదేళ్ళ పాలనలో కొత్త వ్యవస్థలు, యువత భవిష్యత్తుకు పునాదులు, నాలుగు పోర్ట్లు, పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలా పాతికేళ్ళలో చేయలేని దానిని కేవలం అయిదేళ్ళలో శ్రీకారం చుట్టిన ఘనత కనిపిస్తుంది. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఏడాదిలోనే, టీచర్ల నియామకాల్లో గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించి నియామకాలను పూర్తి చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో ప్రగతిపథమైన పాలన జరిగింది.
గత పాలనలోని ప్రగతిని విధ్వంసం చేయడామే లక్ష్యం
ఏడాది చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపించారు. వెన్నుపోటు, బెల్ట్ షాప్, జన్మభూమి కమిటీలకు పేటెంట్ తెచ్చుకున్నారు. దుర్మార్గాలు చేయడానికి ఘనమైన పేరు సంపాధించుకున్నారు. ఆయన కుమారుడు లోకేష్ ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగంతో అటువంటి దుర్మార్గమైన పేరునే తనకు తెచ్చుకున్నారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ పుస్తకాన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివితే ఈ పాలనలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనను నిలదీయాలి. ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఈ పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. ప్రజలు వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని చదివి, చైతన్యవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిచి, హామీల అమలుకు మెడలు వంచి పనిచేయించుకోవాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడితే తాము చేస్తున్న దాష్టీకాల అమలుకు వెనుకాడే అవకాశం ఉంటుంది.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వరుదు కళ్యాణి, మురుగుడు హనుమంతరావు, ఎం.అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పూడి శ్రీహరి, జూపూడి ప్రభాకర్రావు, పార్టీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, పోతిన మహేష్, పి.గౌతంరెడ్డి, ఎన్ చంద్రశేఖర్రెడ్డి, కొమ్మూరి కనకారావు, శివశంకర్రెడ్డి, చల్లా మధు, మనోహర్రెడ్డి, వంగవీటి నరేంద్ర, యానాదయ్యా, మండపాటి శేషగిరిరావు, గజ్జల సుధీర్భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
For YSRCP Book click this link CHANDRABABU ONE YEAR FAILURES BOOKLET 10-06-2025
ఇవీ చదవండి: YS Jagan at Tenali : నడిరోడ్డుపై కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?: జగన్
Vijayasai Tweet on Jagan : జగన్పై విజయసాయి సంచలన ట్వీట్!
