108 Ambulance: ఆపదలో ఉండి ఒక్క ఫోన్ కొడితే చాలు.. కుయ్ కుయ్ కుయ్.. అంటూ 10 నిమిషాల్లో వాలిపోయే అపర సంజీవని 108 వాహనాలు (108 Ambulance) ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయన్న వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ‘‘అంపశయ్యపై ఆపద్బాంధవులు, కుయ్ కుయ్ కాదు.. కుయ్యో మొర్రో.., ఆపద్బాంధవులకు ఆపద’’ లాంటి హెడ్డింగులతో పత్రికల్లో కథనాలు రావడం కలకలం రేపుతోంది. అయితే, గతంలో సమర్థంగా పని చేసిన 108, 104 వ్యవస్థ నేడు దుస్థితికి చేరుకోవడానికి కారకులు ఎవరు?
2004కు ముందు అంబులెన్సుల వ్యవస్థ అంటే ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేది. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ వ్యవస్థకు ఊపిరిలూదారు. 108 వాహనాలను కొత్తవి కొనుగోలు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఆపదలో ఉండి ఫోన్ చేసిన వెంటనే బాధితుల చెంతకు వాలిపోయి ప్రాణాలు రక్షించేలా వ్యవస్థను పటిష్టంగా అమలు చేశారని వైద్యరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే, వైయస్ మరణానంతరం ఈ వ్యవస్థను పాలకులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయన్నది కళ్ల ముందు కనిపించే వాస్తవం అంటున్నారు. 2014-19 మధ్య 108 అంబులెన్సులు నిద్రావస్థలోకి వెళ్లాయని, నిర్వహణ లోపాలు శాపంగా మారి బాధితులకు సాయం అందలేదనే ఆరోపణలు ఉన్నాయి.
2019కి ముందు 108 వాహనాలు 336 ఉండేవని, అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేని పరిస్థితి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 104 అయితే కేవలం 292 వాహనాలు ఉండేవని, అన్నీ కలిపినా 622 వాహనాలు ఉండేవని చెబుతున్నారు. అవికూడా సరిగ్గా పని చేయని పరిస్థితి ఉండేదని గుర్తు చేస్తున్నారు.
కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండూ కలిపితే 1,704 వాహనాలు సమర్థంగా పని చేశాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు 500 కూడా కలిపితే మొత్తం 2,204 వాహనాలు పేదలు, ఆపదలో ఉన్న వారి కోసం పటిష్టంగా పని చేశాయంటున్నారు. 108 వాహనాల్లో బ్యాకప్ పోనూ 731 వాహనాలు క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందించాయని, ఇలా సగటున రోజుకు 3,000కు పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అంబులెన్సులు అండగా నిలిచాయని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కో అంబులెన్స్ రోజుకు 4కు పైగా కేసులకు అటెండ్ అయ్యింది.
తాజాగా 2024లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో డీజిల్లేక, సిబ్బందికి వేతనాలు అందక అనేక అంబులెన్సులు నిలిచిపోవడంతో 108 వ్యవస్థ మళ్లీ 2014-19 మధ్య కాలాన్ని గుర్తు చేస్తోందంటున్నారు. ఇప్పుడు 500లోపు వాహనాలు అరకొరగా సేవలు కొనసాగిస్తున్నాయని పత్రికల్లో కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమర్జెన్సీ సేవలు అందకపోవడంతో బాధితులు వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని ప్రైవేటు అంబులెన్సులు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో వైద్యరంగంలో మళ్లీ పాతరోజులు వచ్చాయని, ఆపదలో ఆదుకునే 108 వాహనాల వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి పటిష్టంగా ఉన్న వ్యవస్థను కొనసాగించాలని హితవు పలుకుతున్నారు.
Read also: Idiot Syndrome: సొంత వైద్యం కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్నారా? ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా?
Apple: రోజుకో యాపిల్ తినడం వల్ల వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని లేదు.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు విస్తరణ
Mega Arogya sri: మెగా ఆరోగ్యశ్రీ క్యాంపెయిన్లో ఏమేం చేస్తారంటే.. ఆరోగ్యశ్రీ వినియోగంపై పూర్తి వివరాలు ఇవీ..
