CEC Press meet: ఏపీలో ఎన్నికల నిర్వహణపై పటిష్టంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని కేంద్ర ఎన్నికల బృందం తెలిపింది. ఏపీలో పర్యటించిన బృందం.. నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడింది. సీఈసీ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకే విడత నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీలకు కీలక సూచనలు చేశారు. (CEC Press meet)
* ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం.
* ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం.
* ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం. నిన్న విజయవాడ లో పార్టీలతో సమావేశం నిర్వహించాం.
* ఓటర్ల జాబితా లో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది.
* ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది.
* అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
* ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామం.
* మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం.
* వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు.
* గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం.
* అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
* సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిథిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి.
* 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది : కేంద్ర ఎన్నికల సంఘం
