CM Jagan review on rains: వర్షాల కొరత దృష్ట్యా సాగు పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు తక్కువ కురవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జూన్-ఆగస్టు మధ్య 25 శాతం తక్కువ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు తెలిపారు. నీటి నిల్వల మేరకు కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. (CM Jagan review on rains)
77 వేల క్వింటాళ్లకు పైగా విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. 80 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ-క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ సూచించారు. కంటింజెన్సీ ప్రణాళికపై కలెక్టర్ల నేతృత్వంలో భేటి పెట్టాలని ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.
వర్షాలు కొరత నేపథ్యంలో విద్యుత్ డిమాండ్, పంపిణీపై కూడా సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టులోనే రూ.966 కోట్ల విద్యుత్ కొనుగోలు చేశామని సీఎం జగన్ తెలిపారు. యూనిట్ విద్యుత్ రూ.7.52కు కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు. వ్యవసాయం రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం వచ్చాక సుమారు 3.3లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని అధికారులు తెలిపారు. గాలి లేనందున విండ్ పవర్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అలాగే బొగ్గు కూడా తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
పొడివాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితిలు ఉండడం వల్ల అనుకోకుండా అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రతి రోజు కూడా కనీసంగా 44.25 మిలియన్ యూనిట్ల కరెంట్ కొనుగోలు చేస్తున్నామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. మార్చి నుంచి ఆగస్టు వరకు రూ. 2,935 కోట్లు వెచ్చించామని అధికారులు తెలిపారు.
Read Also : Perni Nani on CBN: చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది: పేర్ని నాని
