CM Jagan at Delhi: సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న హస్తిన వెళ్లిన జగన్.. సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపై సీఎం చర్చించారు. త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. (CM Jagan at Delhi)
పోలవరం నిధులు అత్యవసరం
సత్వరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి అవసరం ఉందని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలను అందించేందుకు సహకరించాలని సీఎం కోరారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. దీనికి ఆమోదం తెలపాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్గా డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లు చేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమన్నారు. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని సీఎం తెలిపారు.
లైడార్ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జులైలో వచ్చిన భారీ వరదలు వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచాలను రూపొందించామని సీఎం జగన్ తెలిపారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదల చేయాలని కోరారు.
విద్యుత్ బకాయిలు ఇప్పించండి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. 2014 జూన్ నుంచి 2017 జూన్వరకూ సరఫరా చేసిన విద్యుత్ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదన్నారు.
9 ఏళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని, ఏపీ జెన్కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏపీ విద్యుత్ సంస్థలకు ఏర్పడిందన్నారు. వెంటనే ఈ డబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ డబ్బు ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసినమీదన, 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు 29, 2022న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు వ్యవహారంలో పడిపోయిందన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలకు ఆడబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కలిసిన సీఎం జగన్.. విద్యుత్ రంగంలోని పలు అంశాలపై చర్చించారు.