Puri Jagannadh: తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Raghu Kunche తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు Puri Jagannadh గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినీ ప్రయాణంలో పూరి జగన్నాథ్ పాత్ర ఎంతో కీలకమని, ఆయనను తాను “గాడ్ఫాదర్”గా భావిస్తానని రఘు కుంచె పేర్కొన్నారు. కేవలం స్నేహితుడిగా కాకుండా, కెరీర్లో మలుపు తిప్పిన వ్యక్తిగా పూరి గారిని ఆయన అభివర్ణించారు.
మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల జ్ఞాపకాలు
రఘు కుంచె మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తనకంటే సీనియర్ అని, ఇద్దరూ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వారేనని చెప్పారు. “పూరి గారు మొదట నటుడిగా ప్రయత్నించారు. హిందీ ‘శివా’ సినిమాలో కూడా కనిపించారు. తర్వాత దర్శకత్వంపై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు” అని రఘు తెలిపారు. ఇండస్ట్రీలో తాను పూరి గారికి చాలా జూనియర్ అయినప్పటికీ, ఇద్దరి మధ్య బలమైన స్నేహ బంధం ఏర్పడిందని చెప్పారు.
దర్శకుడిగా మారిన తర్వాత పూరి ఇచ్చిన మద్దతు
Puri Jagannadh దర్శకుడిగా మారిన తర్వాత తన జీవితంలో పెద్ద మార్పు వచ్చిందని రఘు కుంచె వెల్లడించారు. “పూరి గారు కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎవరిలో టాలెంట్ కనిపించినా వెంటనే అవకాశం ఇస్తారు” అని చెప్పారు. అందుకు ఉదాహరణగా సంగీత దర్శకుడు Chakriకు ఇచ్చిన తొలి అవకాశాన్ని గుర్తు చేశారు.
చక్రికి తొలి అవకాశం ఎలా వచ్చింది?
రఘు కుంచె చెప్పిన ప్రకారం.. సత్యదేవ్ అనే వ్యక్తి చక్రిని పూరి జగన్నాథ్ వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. “చక్రి కొన్ని ట్యూన్స్ వినిపించగానే పూరి గారు వెంటనే అతనికి ‘బాచి’ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు” అని చెప్పారు. అదే సమయంలో ‘లక్ష్మి లక్ష్మి’ పాటను పాడే అవకాశం కూడా పూరి గారే ఇచ్చారని రఘు గుర్తు చేసుకున్నారు.
మణికొండ భూమి ఘటన.. రాజమౌళి చెప్పిన మాట
ఇంటర్వ్యూలో రఘు కుంచె ఓ ఆసక్తికర సంఘటనను కూడా పంచుకున్నారు.
ఒకసారి పూరి జగన్నాథ్ మణికొండలో ఎప్పుడో కొనుగోలు చేసిన భూమిని మర్చిపోయి వెతుకుతున్న సమయంలో దర్శకధీరుడు S. S. Rajamouli కలుసుకుని.. “మీ భూమి ఇక్కడే ఉంది.. మా పక్కనే” అని చెప్పారని తెలిపారు. ఈ సంఘటన అప్పట్లో ఇండస్ట్రీలో సరదాగా చర్చకు దారితీసిందని రఘు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.
“నువ్వూ సంపాదించుకోవాలి” అన్న పూరి
రఘు కుంచె మాట్లాడుతూ.. Bumper Offer సినిమా సమయంలో పూరి జగన్నాథ్ తనను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాలని భావించారని చెప్పారు. “నువ్వూ సంపాదించుకోవాలి కదా.. ఎన్నాళ్లు ఈ పావలా బేరాల్లో ఉంటావ్?” అంటూ పూరి గారు తనను ప్రోత్సహించారని వెల్లడించారు. అయితే డబ్బు వ్యవహారాలపై తనకు సరైన అవగాహన లేకపోవడం, స్నేహం దెబ్బతింటుందేమోనన్న భయంతో ఆ బాధ్యతను తాను తీసుకోలేదని చెప్పారు.
చివరకు మ్యూజిక్ డైరెక్టర్గా మారిన రఘు
ఆ సమయంలో ముందుగా ఎంపిక చేసిన సంగీత దర్శకుడితో కొన్ని సమస్యలు రావడంతో, పూరి జగన్నాథ్ తననే మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని నిర్ణయించుకున్నారని రఘు తెలిపారు. దీంతో తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలను వదిలేసి సంగీతంపై దృష్టి పెట్టానన్నారు. “ఆ రోజు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతను సీరియస్గా తీసుకుని ఉంటే.. ఈరోజు పూర్తిస్థాయి నిర్మాత అయ్యేవాడిని” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇండస్ట్రీలో పూరి ప్రత్యేకత ఇదే
పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ రఘు కుంచె చేసిన వ్యాఖ్యల్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. టాలెంట్ ఉన్నవారికి వెంటనే అవకాశాలు ఇవ్వడం, కొత్తవారిని నమ్మడం, స్నేహితులను ప్రోత్సహించడం పూరి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశాలని ఆయన చెప్పారు.
అందుకే ఇండస్ట్రీలో చాలామంది కళాకారులు పూరి జగన్నాథ్ను కేవలం దర్శకుడిగానే కాకుండా, కెరీర్ను మలిచిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవీ చదవండి: Aakanksha Puri: సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఆకాంక్ష పూరి.. గ్లామర్తో కుర్రాళ్లను మంత్ర ముగ్ధులను చేస్తున్న బ్యూటీ (Photos)
Hardeep Singh Puri: దేశవ్యాప్తంగా లాక్డౌన్ వస్తుందా..? వదంతులపై కేంద్రం క్లారిటీ
