Rohit pawar allegations: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అంశంగా మారిన అజిత్ పవార్ మృతి కేసులో, రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ ప్రమాదానికి కారణమైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న VSR కంపెనీకి, ఆంధ్రప్రదేశ్కు చెందిన హెరిటేజ్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రోహిత్ పవార్ మాట్లాడుతూ, “VSR కంపెనీకి ఫండింగ్ చేసినట్లు అధికారిక పత్రాల్లో స్పష్టంగా ఉంది. లోన్ రీస్ట్రక్చరింగ్ వివరాలు కూడా రికార్డుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందనే నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది?” అని ప్రశ్నించారు.
రాజకీయ నేతలతో సంబంధాలపై అనుమానాలు
VSR కంపెనీ యజమానులకు, TDP పార్టీ ముఖ్య నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కంపెనీకి రక్షణ లభిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అదే సమయంలో, రామ్మోహన్ నాయుడు పై కూడా రోహిత్ పవార్ విమర్శలు గుప్పించారు. అజిత్ పవార్ ప్రమాదంపై తుది దర్యాప్తు నివేదిక రాకముందే, VSR కంపెనీకి ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారని ప్రశ్నించారు.
DGCA – ఏవియేషన్ మంత్రిత్వ శాఖపై ఒత్తిడా?
ఈ కేసులో Directorate General of Civil Aviation (DGCA) మరియు ఏవియేషన్ మంత్రిత్వ శాఖపై తీవ్ర ఒత్తిడి ఉందని రోహిత్ పవార్ ఆరోపించారు. ఆ ఒత్తిడి మొత్తం VSR కంపెనీని కాపాడటానికే, అజిత్ పవార్కు న్యాయం జరగకుండా చేయడానికేనని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రైవేట్ జెట్ కొనుగోలు వివాదం
ఇటీవల వెలుగులోకి వచ్చిన వార్తల ప్రకారం, రూ.160 కోట్లతో ఏపీకి చెందిన ఓ మంత్రి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ విమానానికి అసలు యజమానులు ఎవరు? ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే అంశాలపై కూడా సమగ్ర విచారణ జరగాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
మోడీ – అమిత్ షాలకు విజ్ఞప్తి
ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని, అజిత్ పవార్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రోహిత్ పవార్ కోరారు.
పారదర్శకతే పరిష్కారం
కార్పొరేట్ – రాజకీయ సంబంధాలు దర్యాప్తును ప్రభావితం చేస్తే, ప్రజాస్వామ్యంపై నమ్మకం దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ – VSR లింకులపై పూర్తి వివరాలు బహిర్గతం చేయడం, స్వతంత్ర సంస్థలతో విచారణ జరపడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Andhra Pradesh : దేవదేవుడి ప్రసాదంపై రాజకీయాలు: చంద్రబాబు ఆరోపణలపై బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు
