Pawan Kalyan at Tirupati: జనసేనాని పవన్ కల్యాణ్.. నేడు తిరుపతిలో పర్యటించారు. జనసేన కార్యకర్త సాయిపై ఐదు రోజుల కిందట శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటనపై జనసేనాని స్పందించారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా తిరుపతి ఎస్పీని కోరేందుకు ఇవాళ పట్టణానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్. మంగళగిరి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి విమానం ద్వారా రేణిగుంట ఎయిర్పోర్టుకు పవన్ కల్యాణ్ వెళ్లారు. (Pawan Kalyan at Tirupati)
రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీగా వచ్చిన పవన్ కల్యాణ్.. వేలాది మంది కార్యకర్తల మధ్య అభివాదం చేసుకుంటూ వెళ్లారు. పలు సర్కిళ్లలో పవన్ను చూసేందుకు వందలాది మంది అభిమానులు గుమిగూడారు. ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా ఎస్పీ కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డిని కలిసే క్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఎస్పీ ఆఫీసు లోపలికి వెళ్తుండగా.. బయట ఉన్న పోలీసు అధికారులు పవన్కు కొన్ని సూచనలు చేశారు.
షర్ట్ బటన్స్ పెట్టుకోండి…
ర్యాలీలో చెదిరిపోయిన జుట్టుతో బటన్స్ ఊడిన షర్ట్తో పవన్ ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడి పోలీసు అధికారులు పవన్కు షర్ట్ బటన్స్ పెట్టుకోవాలంటూ సూచించారు. దీంతో వినమ్రపూర్వకంగా జనసేనాని షర్ట్ బటన్స్ పెట్టుకొని ఎస్పీ కార్యాలయం లోపలికి బయల్దేరారు. అనంతరం అక్కడ తన వినతిపత్రాన్ని ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి అందించారు. అక్కడ వినతిపత్రం ఇవ్వగానే కూర్చోవాలంటూ ఎస్పీ సూచించారు. అనంతరం అక్కడే కాసేపు కూర్చొని సీఐ అంజూ యాదవ్ చర్యలను ఎస్పీకి పవన్ వివరించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం తిరుపతి ఎస్పీ ఆఫీసు నుంచి పవన్ కల్యాణ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు అన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రొటెస్ట్చేయడం మన హక్కు అన్నారు. మానవ హక్కులు కాలరాసిన సందర్భాల్లో డెఫినెట్గా నిరసన తెలుపుతామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇస్తున్నాం.. క్రమ శిక్షణగా ఉంటాం..
రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇస్తున్నామని, ఎప్పటిలాగే డిసిప్లిన్గా ఉంటామని పవన్ తెలిపారు. పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడొద్దని కోరారు. ఈరోజు సాయికి జరగొచ్చు, రేపు ఇంకొకరికి జరగొచ్చని, ఇలాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. తాము చెప్పిన విషయాలు ఎస్పీ విన్నారని, ఈ కేసు విషయం ఆయన దృష్టిలో ఉందన్నారు. కేసును సుమోటోగా తీసుకున్నందుకు మానవ హక్కుల కమిషన్ న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also : CI Anju Yadav: శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది? సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకోవడం, కాంట్రవర్సీ ఏంటి?
