HomeTelanganaMinister KTR: తెలంగాణలో ఉన్నది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్‌.. మంత్రి కేటీఆర్‌ కామెంట్స్‌

Minister KTR: తెలంగాణలో ఉన్నది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్‌.. మంత్రి కేటీఆర్‌ కామెంట్స్‌

Minister KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదని, చంద్రబాబు నాయుడి కాంగ్రెస్‌ అని కామెంట్‌ చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతులకు మూడు గంటలు కరెంటు చాలు.. 24 గంటలు కరెంటు అనవసరంగా ఇస్తున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు రేవంత్‌రెడ్డి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. (Minister KTR)

బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కాంగ్రెస్‌లో కూడా కొందరు నేతలు దీనిపై సీరియస్‌ అయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా రేవంత్‌ వ్యాఖ్యలతో విభేదించారు. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను తీసుకొచ్చారని, ఆ ఫైలుపైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమన్నారు. దీంతో అటు కాంగ్రెస్‌లోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఇటు అధికార పార్టీ నేతలు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముడిపెడుతూ రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

తాజాగా ఇదే అంశంపై మంత్రి కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. “ఆనాడు రాజశేఖరరెడ్డి గారు కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ లీడర్‌గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చిన మాట వాస్తవం. కానీ ఇయ్యాల రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ ఉన్నదా? ఇయ్యాల ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి కాంగ్రెస్‌ తప్ప రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ను ఎప్పుడో జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆంధ్రాకు తీస్కపోయిర్రు. అక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తోంది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌.

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు నాయుడి కాంగ్రెస్‌ పార్టీ తప్ప ఇది రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ కాదు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదు. ఇది తెలుగు కాంగ్రెస్‌ పార్టీ. అందుకే వాళ్ల విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగ అంటే ఈయన (రేవంత్‌ రెడ్డి) కరెక్ట్‌గా ఆయన శిష్యుడు, ఏజెంట్‌ కాబట్టి ఈయన కూడా అదే చెబుతున్నాడు.

చంద్రబాబు వ్యవసాయం దండుగ అంటే ఇక్కడ ఉన్న ఛోటా చంద్రబాబు మూడు గంటలు చాలు.. అని తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నాడు. అందుకే కాంగ్రెస్‌ నాయకులకు నేను గుర్తు చేస్తున్నా.. ఇక్కడున్న కాంగ్రెస్‌ ఈరోజు మీది కాదు. ఇక్కడున్న కాంగ్రెస్‌ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్‌ తప్ప ఇంకోటి కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్‌.” అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఈ టాపిక్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కేటీఆర్‌ మాట్లాడిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Read Also : YS Sharmila : తెలంగాణలో కొత్త పొత్తులు..! కాంగ్రెస్‌కి షర్మిల పార్టీ దగ్గరవుతోందా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు