WI vs IND: ఐపీఎల్లో దుమ్ము దులిపేసిన యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు బీసీసీఐ తీపి కబురు చెప్పింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కూ గుడ్ న్యూస్ అందింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్.. (WI vs IND) మూడు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లు ఆడనుంది. ఇందులో భాగంగా టెస్టు సిరీస్కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. టెస్టులు, వన్డే సిరీస్లకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వచ్చే నెల జూలై 12వ తేదీ నుంచి టీమిండియా జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓటమిపాలైన టీమిండియా.. విండీస్ టూర్తో కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. డబ్ల్యూటీసీలో భారత బ్యాటర్లు తీవ్ర నిరాశ పరిచిన నేపథ్యంలో కొందరిపై వేటు వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో భాగంగా సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాను తప్పించింది. అతని స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను తీసుకుంది. అతడితోపాటు రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు. వికెట్ కీపర్లుగా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్తో పాటు ఇషాన్ కిషన్ను కూడా తీసుకున్నారు. ఇక పేసర్లలో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. మరోవైపు యువ పేసర్ నవదీప్ సైనికి చోటు దక్కింది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను వన్డేల్లోకి తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత అతడు జట్టులోకి వచ్చినట్లవుతోంది. ఇక వన్డేల్లో వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్కు చోటు దక్కింది. అతడితోపాటు ఇషాన్ కిషన్నూ తీసుకుంది బీసీసీఐ. వన్డే సిరీస్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా, హార్దిక్ పాండ్యకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక వన్డేల్లో పేసర్ల విషయానికి వస్తే.. యువ బౌలర్ ముఖేష్ కుమార్కు చాన్స్ దక్కింది. వన్డే ప్రపంచకప్ త్వరలోనే రానున్న నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశాలివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
రింకూ సింగ్ను తీసుకుంటారా?
గడచిన ఐపీఎల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన కొందరికి బీసీసీఐ ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అవకాశం కల్పిస్తోంది. అయితే, గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున బెస్ట్ ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్ను టెస్టులు, వన్డేల్లో తీసుకోలేదు. టీ20ల్లో తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికైతే వెస్టిండీస్ టూర్లో భాగంగా టెస్టులు, వన్డే సిరీస్లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ… టీ20 సిరీస్కు మాత్రం ఇంకా జట్టు సభ్యులను ప్రకటించలేదు. రింకూసింగ్, నితీష్ రాణాతో పాటు సందీప్ శర్మ, జితేష్ శర్మ, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, సుదర్శన్తో పాటు ఇంకా పలువురు యువ క్రికెటర్లకు చాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
టెస్టులకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్సైని.
వన్డేలకు టీమిండియా సభ్యులు వీరే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయ్దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
Read Also : Indian Cricketers: ఈ క్రికెటర్లు ప్రభుత్వ అధికారులుగా గుర్తింపు పొందారు..
