Tirumala Samacharam 23-07-2023: వేంకటగిరిహిత గోవిందుడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీనివాసుడిని 84,430 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.45 కోట్లు చేకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇలవైకుంఠంలో కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శనం చేసుకొనేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. టీటీడీ భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. (Tirumala Samacharam 23-07-2023)
Read Also : Sri Venkateswara: కలియుగ వైకుంఠ నాథునికి ఎన్ని కోట్ల ఆస్తులంటే..
శ్రీవారి ఆస్తుల వివరాలు వెల్లడించిన ఈవో..
తిరుమల వెంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు. వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడనే సంగతి భక్తులందరికీ తెలిసిందే. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి హుండీ రూపేణా నిత్యం కోట్లలో ఆదాయం సమకూరుతోంది. స్వామివారికి ఎంతటి ఆస్తి ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా వెల్లడించింది. వారణాసిలో జరిగిన అంతర్జాతీయ ధార్మిక సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి ఆస్తులు, ఇతర నిర్వహణ వివరాలను ఆయన వెల్లడించారు.
తిరుమల శ్రీవారి పేరిట బ్యాంకులో రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయని ఈవో పేర్కొన్నారు. బ్యాంకులో 11 టన్నుల బంగారం డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. స్వామి వారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు 1.2 టన్నులుగా ఈవో తెలిపారు. వెండి ఆభరణాల బరువు 10 టన్నులు ఉందన్నారు. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీలో 24,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తులకు సేవలందించే ఉద్యోగుల సంఖ్య 800 అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్వామివారికి ఏటా 500 టన్నుల పుష్పాలతో అలంకరణ గావిస్తున్నట్లు ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. టీటీడీ కింద దేశవ్యాప్తంగా 71 ఆలయాలు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి వివరించారు.
Read Also : Gold Price today 23 July 2023: వెండి, బంగారం తగ్గాయి.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..