YSR Law Nestam: వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) విడుదల చేశారు. యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ తొలి మూడు సంవత్సరాలు సాయం అందించిన ప్రభుత్వం.. 2023-24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం కింద సొమ్మును సీఎం జగన్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైపెండ్ చొప్పున ఫిబ్రవరి 2023 – జూన్ 2023 (5 నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 ఇచ్చారు. మొత్తం రూ. 6,12,65,000ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. (YSR Law Nestam)
అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి.. నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఈ దఫా దాదాపుగా 2,677 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్ల్ జమ చేస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తోడుగా.. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం అని చెప్పారు. న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నామన్నారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారని తెలిపారు. ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారని, మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.
ఇప్పటివరకూ 5,781 మంది జూనియర్ న్యాయవాదులకి మేలు చేశాం. 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంతవరకూ మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోందని పేర్కొన్నారు. ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేశామని వివరించారు.
మెడిక్లెయిమ్ కాని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటివాటికి, ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశామన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లిందన్నారు. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే.. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసం.. అని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదేనని చెప్పారు. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుందని, దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నాన్నారు. ఈ మంచిని ప్రతి పేదవాడికీ తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నానన్నారు.